02/03/2023

తెలంగాణ లేదా భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక చక్కని నమూనా!

తెలంగాణ లేదా భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక చక్కని నమూనా!

తెలంగాణ లేదా భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక చక్కని నమూనా!



- బత్తిని శ్రీనివాసరావు

        భారతదేశం  నేటికీ ఒక అర్ధ వలస అర్థ ఫ్యూడల్ సమాజం అని కమ్యూనిస్టు పార్టీలు కొన్ని భావిస్తున్నాయి. మరికొన్ని పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందినప్పటికీ, దేశంలో భూస్వామ్య విధానం - విదేశీ సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువులని  ప్రకటిస్తున్నాయి.  ఈ ప్రకటనల అసలు  సారాంశాన్ని అర్థం చేసుకునేందుకు ఫ్యూడలిజం అంటే ఏమిటో, అర్ధ  ఫ్యూడలిజం అంటే ఏమిటో మనకు స్పష్టత అవసరం.  అలాంటి సమాజాలు ఎలా ఉంటాయో మనం స్పష్టంగా గ్రహించడం అవసరం.  తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి తెలంగాణ అలాంటి  సమాజానికి ఒక చక్కని నమూనా.  నాటి తెలంగాణ పరిస్థితులకు చెందిన సంక్షిప్త వివరణ ఇది. 
        హైదరాబాద్ దక్కన్ రాజ్యంలో భాగంగా తెలంగాణను అసఫ్ జాహి పాలకులు1724 నుండి 1948 వరకు పాలించారు. వీరికి నిజాం అనే బిరుదు ఉండింది. వీరు మొదట దక్కన్లో మొఘల్ సామ్రాజ్యం యొక్క వైస్రాయిలుగా ఉండేవారు. వారు వరుసగా (1) మీర్ కమరుద్దీన్ (నిజాం-ఉల్-ముల్క్-అసఫ్ జా I, 1724-1748), (2) నాసిర్ జంగ్ ( 1748 -1751), (3) ముజాఫర్ జంగ్ (1750-1751), (4) సలాబత్ జంగ్ (1751-1761), (5) నిజాం అలీ ఖాన్-అసాఫ్ జా II (1762-1803), (6) నిజాం III సికందర్ జా (1803-1829), (7) నిజాం IV -నాసిర్-ఉద్- దౌలా (1829-1857), ( నిజాం V - అఫ్జల్-ఉద్-దౌలా (1857-1869), (9) నిజాం VI -మీర్ మహాబూబ్ అలీ ఖాన్ (1869-1911), మరియు(10) నిజాం VII - మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1911-1948 సెప్టెంబర్) లు .
        1798 లో నిజాం ఆలీ ఖాన్ (అసఫ్ జాహి 2) బ్రిటిష్ సార్వభౌమా ధికారాన్ని అంగీకరించి అనుబంధ కూటమి ఒప్పందం చేసుకున్నారు. దీంతో నిజాం రాజ్యం బ్రిటిష్ సార్వభౌమాధికార పరిధిలోకి వచ్చిన మొదటి రక్షిత రాజ్యంగా దేశంలో అవతరించింది. అది నిజాం రాజ్యాన్ని బ్రిటిష్ రక్షణలో పెట్టింది.నాటి నుండి నిజాం రాజులు బ్రిటిష్ వారికి నమ్మకమైన సేవకులుగా ఉండినారు.1857 నాటి భారత ఫ్యూడల్ తిరుగుబాటు సమయంలో (1857–58) కూడా నిజాం రాజ్యం బ్రిటిష్ వారికి విధేయుడిగా ఉండింది.
            1901 గణాంకాల ప్రకారం బ్రిటిష్ పాలనలో నిజాం రాజ్యానికి సాంవత్సరిక ఆదాయం సగటున రూ 417,00,000 ఉండింది. ఇది భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాచరిక రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్,1930 లలో ప్రపంచంలో అత్యంత ధనవంతునిగా ప్రసిద్ధి చెందాడు.
        నిజాం రాజ్యం 82,700 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. సుమారు 5,30,00,000 ఎకరాల భూవిస్తీర్ణంని కలిగి ఫ్యూడల్ వ్యవసాయ సమాజంగా ఉండేది; 1941 గణాంకాల ప్రకారం, నిజాం రాజ్య జనాభా 1,63,40,000. 90% గ్రామాల్లో నివసించేవారు. 1940-41లో 5% అక్షరాస్యత, 95% మంది ప్రజలు నిరక్షరాస్యులు. దాదాపు 75% గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. 1949 లో, దివానీయేతర గ్రామాలలో 98 శాతం గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు లేవు.
            1939-40 భూ వినియోగ గణాంకాల ప్రకారం, మొత్తం 5.3 కోట్ల ఎకరాల నికర విస్తీర్ణంలో 21.1% సాగుకు అందుబాటులో లేదు. మిగిలిన భూమిలో 53.7% భూమి, అంటే 2.85 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండింది.అందులో 67.4% ఆహార పంటలు కింద, 8.8 శాతం బంజరు కింద, 6.2% సాగు వ్యర్థాలు మరియు 11.7 శాతం అడవుల క్రింద ఉండింది.  ఈ సాగు భూమిలో 60 శాతం దివానీ లేదా ఖాల్సా కింద, 30 శాతం జాగీర్దారీ వ్యవస్థలో, 10 శాతం సర్ఫ్-ఇ-ఖాస్ అంటే నిజాం వ్యక్తిగత ఎస్టేట్స్ కింద ఉండేది. రాజ్యంలోని 21,875 గ్రామాలలో 8,128 గ్రామాలు జాగీర్ల కింద ఉన్నాయి. అంతేకాక, నిజాంకు చెందిన సర్ఫ్-ఇ-ఖాస్ 3,335 గ్రామాలను ఆవరించి లక్షలాది ఎకరాల భూమిని కలిగి ఉండేది.
    జాగీర్దారీ వ్యవస్థలో వందలాది గ్రామాలను నియంత్రించే పైగాలు, ఇలాకాలు,సంస్థానాలు, జాగీర్లు, ఎస్టేట్లు ఉండేవి. ఉదాహరణకు అస్మాన్ జా (401 గ్రామాలు), కుర్షీద్ జా (396 గ్రామాలు), మరి వికార్-ఉల్-ఉమ్రా (397 గ్రామాలు) లాంటి పైగాలు ఉండేవి. అతిపెద్ద ఇలాకాల క్రింద ఉన్న గ్రామాలు: సాలార్ జంగ్ (359 గ్రామాలు), మహారాజా కిషన్ పెర్షాద్ (ప్రసాద్) (20 గ్రామాలు), నవాబ్ ఖాన్ (89 గ్రామాలు) మరి నవాబ్ ఫఖర్-ఉల్-ముల్క్ బహదూర్ (113 గ్రామాలు). అలాగే,రాజా ధరం కరణ్ బహదూర్ (186 గ్రామాలు), రాజా శంకరాజ్ బహదూర్ (119 గ్రామాలు), కళ్యాణి (60 గ్రామాలు), సూర్ జంగ్ (34 గ్రామాలు), మెహదీ జంగ్ లాంటి (75) గ్రామాలతో పన్ను మినహాయింపు పొందిన ఎస్టేట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు గడ్వాల్ (122 గ్రామాలు), వనపర్తి (150), జట్ ప్రోలు (86), అమర చింత (69), పాల్వంచ (70) అనే ప్రముఖ సంస్థానాలు ఉండేవి. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలు, విసునూరి రామచంద్రారెడ్డి లాంటి 40,000 ఎకరాల భూమి, ఖమ్మం జిల్లాలో కల్లూరు దేశ్ముఖ్ 1,00,000 ఎకరాలు కలిగిన దేశముఖులు, జాగీర్దార్లు ఉండేవారు. వీరంతా వంశపారంపర్య భూస్వామ్య హక్కులు కలిగి ఉండేవారు; వార్షిక కప్పాలు చెల్లిస్తూ, వారే తమ ఆధీనంలోని గ్రామాల్లో సర్వాధికారాలు చెలాయించే వారు; సొంత కోర్టులను నిర్వహించేవారు. జాగీర్దారీ ప్రాంతాలపై ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ లేదు. ఈ స్థానిక పాలకులు తమ ప్రాంతాలలో నియంతలుగా వ్యవహరించేవారు.
     నిజాంతో సహా ఇలాంటి సంస్థానాధీశులు, దేశముఖ్ లు, దేశ్‌పాండియాలు, జమీందారీ, జాగీర్దారీలు, పెద్ద భూస్వాములు, దాదాపు 1500 మందితో కూడిన ఈ ఫ్యూడల్ భూస్వామ్య వర్గమే నిజాం తెలంగాణలో ప్రత్యక్ష పాలక వర్గంగా, మరోవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదం పరోక్ష పాలక వర్గంగా అధికారంలో ఉంటూ, తమ ఫ్యూడల్ - వలస దోపిడీ పాలనలను కొనసాగించాయి. దానికి అవసరమైన సైనిక, పోలీసు, న్యాయ, రెవిన్యూ వ్యవస్థలతో కూడిన రాజ్య యంత్రాంగం నిర్మించబడింది. హైదరాబాద్ నగరంలోని మార్వాడిలు, అగర్వాలులు, జైనులు మరియు గోస్వామిలతో కూడిన బ్యాంకర్లు, మనీలెండర్లు, మరి కిరాయి మిలిటరీ కమాండర్లు కూడా రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు.తాలూక్దార్లు (రెవెన్యూ కాంట్రాక్టర్లు), గ్రామస్థాయిలో పటేల్ పట్వారీ వ్యవస్థ బలమైన పునాదిగా ఉండేది.
        నిజాం రాజ్యం పూర్తిగా బ్రిటీష్ నియంత్రణ క్రింద ఉండింది. ఫైనాన్స్, రెవెన్యూ, పోలీస్ లేదా హోమ్ శాఖలు ఆంగ్లేయుల చేత నిర్వహించబడ్డాయి. నిజాం నవాబు కుటుంబసభ్యుల, యువరాజుల విద్య - వివాహాలు తదితర విషయాలను కూడా హైదరాబాదులో ఉండే బ్రిటిష్ రెసిడెంట్ నిర్ణయించబడి నిర్దేశింపబడేవి.
        ఈ విధంగా నిజాం రాజ్య పాలన బ్రిటీష్ వలస పాలకుల పరోక్ష పర్యవేక్షణ కింద జరిగేది. నిజానికి ఆ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు చెంది ఒక అర్ధ వలసగా ఉండేది. నిజాం రాజ్యానికి కేంద్రీకృత సైన్యం లేదు. కొద్ది మంది ప్రభువులు, సైన్యాధిపతుల ఆధీనంలో విడివిడిగా సాయుధ సైనిక దళాలు నిర్వహింపబడేవి. అరబ్,’ ఆఫ్ఘన్,’ సిక్కు సైన్యాధిపతుల ఆధీనంలో ఆయా ప్రత్యేక ప్రాంతాలకు చెందిన సైనిక దళాలు ఉండేవి. యూరోపియన్ సైన్యాధిపతుల ఆధీనంలో కూడా కొన్ని సైనిక దళాలు ఉండేవి.

నిజానికి నిజాం పాలన ఒక పచ్చి ఫ్యూడల్ రాచరిక నిరంకుశ పాలన.

            ఇస్లాం అధికార మతంగా, ఉర్దూ అధికార భాషగా ఉండేది. ఇతర భాషల పట్ల, మతస్తుల పట్ల అన్ని రంగాలలో వివక్షత కొనసాగింది. 85% మంది ప్రజలు ముస్లిమేతరులు. వారికి తమ మాతృభాషలో బోధన లేదు. లేదా వారికి సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలకు మాతృభాషలో స్థానిక పాఠశాలలను స్థాపించడానికి అనుమతి ఉండేది కాదు. 1949 లో, దివానీయేతర గ్రామాలలో 98 శాతం ప్రాథమిక పాఠశాలలు లేకుండానే ఉండినాయి ముస్లిమేతరులను తక్కువ శ్రేణి మనుషులుగా చూసేవారు. కుల వ్యవస్థ - కుల వివక్షతలు, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రబలంగా ఉండేవి. దళిత- శూద్ర తదితర శ్రామిక కులాలకు చెందిన వారిని అగ్రకులాల వారు తమ బానిసలుగానే భావించేవారు. బాల్యవివాహాలు, బహుభార్యాత్వం వాడుకలో ఉండినాయి, విడాకులు, వితంతు వివాహాలు చాలా అరుదు. పత్రికలు - బహిరంగ సభలను నిర్వహించడంపై సెన్సార్షిప్, నిషేధాలు విధింపబడేవి. పౌర స్వేచ్ఛ- ప్రజాస్వామిక హక్కులు లేవు. రాజకీయ పార్టీలకు అనుమతి లేదు. వాటిపై నిషేధం ఉండేది.
.
         నిజాం రాజ్య సాగు భూములలో 1,500 మంది భూస్వామ్య ప్రభువులు 40% భూమిని కలిగి ఉండినారు. 3 మిలియన్ల మంది కౌలు రైతులు ఉండేవారు. నిజాంకు చెందిన సొంత భూమి సర్ఫ్-ఇ-ఖాస్ 3,335 గ్రామాలను ఆవరించి . నిజాంరాజ్యంలో ( 10%) లక్షలాది ఎకరాల భూమిని కలిగి ఉండేది. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే నిజాం నవాబుకు పది లక్షల ఎకరాలకు పైగా సొంత భూమి ఉండేది. సర్ఫ్ -ఎ-ఖాస్ ప్రాంతాల్లోని రైతుల పరిస్థితి ఏమిటంటే, నిజాం కింద వారు బానిసలుగా బ్రతికేవారు.దివానీ లేదా ఖల్సా కింద భూములలో 35-40 శాతం పైగా భూమి వందలాది పెద్ద భూస్వాముల చేతుల్లో ఉండేది. 1937-38లో నియమించబడిన భూకౌలు కమిషన్, దివానీప్రాంతాలలో కూడా అప్పుల కారణంగా 1/3 వంతు పేద - మధ్య తరగతి రైతుల భూమి పెద్ద భూస్వాములు, వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి బదిలీ అయిందని  ప్రకటించింది.
           నిజాం రాజ్యంలో సాగుకు అనువైన మెజారిటీ భూమి గుప్పెడు మంది ఫ్యూడల్ భూస్వాముల చేతుల్లో కేంద్రీకరించబడిన స్థితి. ఆ కారణంగా రైతులు వారి దగ్గర భూమిని కౌలుకు తీసుకుని, సంవత్సరం పొడుగూతా పనిచేసి, వచ్చిన పంటలో సగభాగం వరకూ కౌలుగా చెల్లించేవారు. మిగిలిన భాగాన్ని తమ సొంత అవసరాలకు, కొంత మారకానికి, అమ్మకానికి ఉపయోగించేవారు. మరోవైపు భూస్వాముల, పటేల్స్, పట్వారీల పొలాల్లో, ఇళ్లల్లో, గ్రామాల్లోని అనేక పనుల్లో రైతులు ఎలాంటి కూలి లేకుండా వెట్టిచాకిరి (బలవంతపు శ్రమ) చేసేవారు. అవసరమైనప్పుడల్లా వెట్టి పనికి ప్రతి కుటుంబం నుండి ఒకరిని పంపేవారు. మెజారిటీ రైతులకు భూస్వాముల, పటేల్, పట్వారీల చెప్పుచేతుల్లో ఎలాంటి హక్కులు లేకుండా బానిసగా బ్రతికే స్థితి ఉండేది. అంతేగాక గ్రామాధిపతుల ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే, వారి చేతుల్లో ఆ పేద కౌలుదార్లు అనేక రకాల క్రూర శిక్షలను కూడా అనుభవించవలసి వచ్చేది . కొన్ని సందర్భాల్లో గ్రామాధిపతులను తృప్తి పరిచేందుకు, వారి దయా దాక్షిణ్యాలను పొందేందుకు వీరు నజరానాలు, జరిమానాలు చెల్లించేవారు.
        నిజాం రాజ్యంలో పాలక ఫ్యూడల్ వర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాద రక్షణ క్రింద ఫ్యూడల్ వ్యవస్థ ప్రాబల్యాన్ని కాపాడుతూ వచ్చింది. ముఖ్యంగా నిజాం రెవెన్యూ వ్యవస్థ భూస్వామ్య దోపిడీ విధానానికి రక్షణ కవచంగా నిలిచింది, రైతులు నేరుగా నిజాం ప్రభుత్వానికి గాక, మధ్య దళారీలైన జాగీర్దార్లకు, జమీందారులకు, దేశపాండ్యాలకు పన్నులు, కౌలు చెల్లించవలసి ఉండేది. నిజాం రాజులు ఒక నిర్దేశిత మొత్తాన్ని తమకు భూమిశిస్తుగా చెల్లించే ఒప్పందంపై రెవెన్యూ అధికారాలను సంస్థానాధీశులు, దేశముఖ్లు, దేశ్‌పాండియాలు, జమీందారీ, జాగీర్దారులకు విస్తారమైన ప్రాంతాలను వంశపారంపర్య హక్కులతో ఇచ్చారు.. నిర్దేశించిన దానికంటే అదనంగా వారు పటేల్, పట్వారీల ద్వారా రైతుల నుండి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని వసూలు చేసేవారు. నిర్దేశించిన మొత్తాన్ని రాష్ట్ర ఖజానాలో చెల్లించి, మిగిలిన దాన్ని వారు తమ పొట్టలో నింపుకునే వారు. రైతు చెల్లించడంలో విఫలమైతే భూమిని, సంబంధిత దేశ్ముఖులు, దేశపాండ్యాలు, పటేల్ లేదా పట్వారీలు స్వాధీనం చేసుకునేవారు. 1937-38 భూకౌలు కమిషన్, అంచనా ప్రకారం, రైతు కుటుంబాలలో సగానికి పైగా కౌలుదారి కుటుంబాలుగా ఉంటూ అర్థ బానిసల స్థితిని అనుభవించేవారు.
        ఈ విధంగా, రాజ్యం - భూమిపై రాజుల, భూస్వాముల అధికారం - యాజమాన్యం కారణంగా, రైతాంగం కౌలుదారి విధానం ద్వారా, వ్యక్తి స్వేచ్ఛ లేకుండా వెట్టిచాకిరి (నిర్బంధ శ్రమ) ద్వారా దోపిడి చేయబడుతూ, ప్రధానంగా సొంత అవసరాల కొరకు ఉత్పత్తి చేసే విధానాన్ని ఫ్యూడల్ భూస్వామ్య విధానం అంటారు.
       తెలంగాణ ఫ్యూడల్ సమాజ అభివృద్ధి క్రమంలో వివిధ రూపాలలో నిదానంగానే అయినప్పటికీ వ్యవసాయము, పశుపోషణ, వివిధ రకాల చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో అదనపు ఉత్పత్తుల మారకం, వర్తక వ్యాపారాలు ఒక స్థాయి వరకు అభివృద్ధి చెందాయి. అయితే 1858 బ్రిటిష్ వలస వాదులు తమ పారిశ్రామిక ప్రయోజనాలకు అనుగుణ్యమైన రీతిలో పాలనా రంగంతో సహా వివిధ రంగాలను సంస్కరించి మార్పు చేసేందుకు నిజాం పాలన పై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు..దివాన్ సాలార్జంగ్ (1853 -83) హయాంలో వివిధ రంగాలలో చాలా నెమ్మదిగా తమ పారిశ్రామిక ప్రయోజనాల కనుగుణమైన మార్పులను అమలు జరిగేలా చూశారు.
1850లోతెలంగాణ లోని దీవాని ప్రాంతంలో భూమినంతా సర్వే చేసి, కొన్ని ప్రాంతాలలో రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెట్టేలా చేశారు. ఈ మార్పును కూడా తమకు అనుకూలంగా మలుచుకుని భూస్వాములు, పటేల్, పట్వారీలు తమ చేతుల్లోనే ఎక్కువగా భూమి ఉండేలా చేసుకోగలిగినప్పటికీ, చిన్న మధ్యతరహా స్వతంత్ర రైతుల సంఖ్య క్రమంగా పెరిగింది. సాగులో లేని భూములను, చిట్టడవులను నరికి సాగులోకి తెచ్చేందుకు రైతులకు పట్టాలు ఇచ్చి ప్రోత్సహించారు. బ్రిటిష్ పారిశ్రామిక సరుకులతో పోటీపడలేక పనులు కోల్పోయిన నేతపని వారు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగులు తదితర చేతివృత్తుల కుటుంబాలకు చెందిన లక్షలాది మంది కొత్తగా రైతులు- కూలీలుగా మారారు. చెరువులు కుంటల నిర్మాణం పెరిగింది. అప్పుల కారణంగా భేదఖల్లు చేయబడ్డ కౌలుదార్లు కూడా కొత్త ప్రాంతాలకు రైతులు, కూలీలుగా వెళ్లి పని చేయడం మొదలుపెట్టారు. 1937 నాటికి పాత వాటితో సహా 6780 చెరువులు, 10,150 కుంటలు, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మింపబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి నిజాం సాగర్, పోచరం, దిండి, పలైర్, వైరా, మనైర్ మరియు మంజీరాలోని ఘన్‌పూర్ వద్ద మరియు గోదావరిలోని ఖానాపూర్. 1855 నాటికి 9,60,000 ఎకరాల సాగుబడిలో ఉన్న భూమి, 1937 నాటికి 2,91,00,000 ఎకరాలకు పెరిగింది. ఇందులో చాలా భాగం 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి సాగులోకి వచ్చింది. ఈ క్రమంలో గుల్బర్గా, ఔరంగాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాలోని విస్తారమైన అటవీ ప్రాంతాలు సాగులోకి వచ్చాయి. గొల్ల, కుర్మ, బంజారా తదితర సంచార జాతులకు చెందిన ప్రజలు, ఇతర ఆదివాసీ ప్రజలు క్రమంగా ఆ ప్రాంతాలలో గ్రామాలు ఏర్పాటు చేసుకుని రైతులుగా, కూలీలుగా స్థిరపడ్డారు.
    నిజాం రాజ్యంలో 19వ శతాబ్దం దాకా ప్రధానంగా జొన్నలు సజ్జలు పప్పుధాన్యాలు ఆహార పంటలుగా సాగు చేసే స్వయం పోషక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఉండింది. పరిమితంగా వరి, గోధుమలు పండించేవారు.వ్యవసాయపరంగా అనుసంధానించబడిన వాణిజ్య - వ్యాపారం, రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి తక్కువ. పెట్టుబడిదారీ పూర్వ జీవనాధార వ్యవసాయం, యాంత్రికం కాని దేశీయ పరిశ్రమలు మరియు స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు పరిమితమైన స్థితిలో ఉండేది.
    హైదరాబాద్, వరంగల్, ఔరంగాబాద్ పట్టణాల్లో చిన్న పరిశ్రమలు మాత్రమే అభివృద్ధి చెందాయి. తెలంగాణ ప్రాంతంలో కొంత బొగ్గు గనులు ఉండేవి. సింగరేని కాల్లియరీస్ రాష్ట్రంలో మొట్టమొదటి బొగ్గు క్షేత్రం. అది 1889 లో లండన్లోని హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీచే ప్రారంభించబడింది. ఇది 1920 లో హైదరాబాద్ కంపెనీల చట్టం ప్రకారం 'ది సింగరేని కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్)’ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి రిజిస్టర్ చేయబడి, ‘హైదరాబాద్ (దక్కన్) కో. లిమిటెడ్’ యొక్క అన్ని ఆస్తులు మరియు బాధ్యతలను సొంతం చేసుకుంది. నిజాం రాజ్యం 1945 లో కంపెనీ మెజారిటీ షేర్లను కొనుగోలు చేసింది.
    బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద్వారా తమ మార్గదర్శకత్వంలో వ్యవసాయ సమస్యలను అధ్యయనం చేసి పరిపాలనను మెరుగుపరచడానికి కొన్నిరాజ్యాంగ సంస్కరణలు మరియు నిర్మాణ చర్యలు తీసుకున్నారు. నిజాం రాజ్యానికి నగదు అవసరాలు పెరిగే కొద్దీ, జలాశయాలు, నీటిపారుదల అభివృద్ధి, సహకార రుణ వ్యవస్థ, వ్యవస్థీకృత బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్కెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.
    1920 లలో మాత్రమే నగదు పంటలు వేరుశనగ, పత్తి, పొగాకు, నూనె విత్తనాల సాగు వృద్ధి చెందింది. హైదరాబాద్‌లో వేరుశనగ, పత్తి ముఖ్యమైన నగదు పంటలు. వేరుశనగ, పత్తి ప్రధానంగా బొంబాయి, మద్రాసులకు ఎగుమతి చేయబడింది. వేరుశనగ మరియు కాస్టర్ సాగు ప్రధానంగా భూస్వాములు, పటేల్, పట్వారీల చేతిలో ఉండింది. ఈ పంటలకు అనువైన భూములను ఇతర రైతులు స్వాధీనం చేసుకోవడానికి వారు అనుమతించలేదు.ఆ విధంగా వారు వాణిజ్యీకరణ నుండి లాభం పొందటానికి ఇతర రైతులను అడ్డగించారు. వేరుశనగ సాగు ద్వారా వచ్చే లాభాలను చూసిన తరువాత, తమ భూములను వేరుశనగ, పత్తి పంటల సాగుకు తీసుకురావడానికి మధ్య తరగతి రైతులు ప్రయత్నించారు. క్రమంగా రైతుల జీవితంలో అన్ని రకాల నగదు పంటల ఉత్పత్తి ప్రాముఖ్యత సంతరించుకుంది. వేరుశనగ, కాస్టర్ సాగు విస్తీర్ణం 1930లో ఉన్న6.2 లక్షల ఎకరాల నుండి 1943 లో 26 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రధానంగా నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో 1930 లలో నూనె విత్తనాల సాగు, పత్తి, చెరకు సాగు క్రమంగా పెరిగింది. . 1940-1లో సాగు విస్తీర్ణంలో1,81,80,709 ఎకరాలు ఆహార పంటల క్రింద ఉన్నాయి (జోవర్ 33.7 శాతం, బజ్రా 5.6 శాతం, గోధుమ 3.9 శాతం, వరి 4.5 శాతం) మరియు 43,55,238 ఎకరాలు చమురు పంటల కింద ఉన్నాయి.
        1936-37లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కాస్టర్ ఎగుమతికి ప్రధాన కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుండి కాస్టర్ ఎగుమతులు భారతదేశం యొక్క మొత్తం కాస్టర్ ఎగుమతిలో 75.8 శాతం. తీరప్రాంత ఆంధ్ర నుండి వలస వచ్చిన రైతులతో మరింతగా మార్కెట్ ఆధారిత వ్యవసాయం పెరిగి, ఫ్యూడల్ వ్యవస్థ చట్రంలోనే ‘ధనిక రైతు ఆర్థిక వ్యవస్థ’ నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1854 లో భూమి ద్వారా వచ్చిన ఆదాయం సుమారు రూ. 65 లక్షలు కాగా, 1944 లో ఇది రూ. 3.33 కోట్లు, 360 శాతం పెరుగుదల చూపిస్తుంది. కానీ ఈ కాలంలో భూమి ఆదాయంలో  సంస్థానం వాటా 85 నుండి 33.9 శాతానికి తగ్గింది. 1936-40 మధ్య సంవత్సరానికి ఆహార పంటల కింద సగటు విస్తీర్ణం 1,94,93,000 ఎకరాలు, 1940-44 మధ్య కాలంలో 1,83,44,000 ఎకరాలు అంటే 10,49,000 ఎకరాల సాగు తగ్గింది. ఆహార పంటల సాగు మొత్తం విస్తీర్ణంలో 66.6 శాతం ఉండింది. 1936-40 మధ్య అప్పుల్లో మునిగిన రైతులు 67.45 శాతంతో పోలిస్తే. సుమారు కేశవ అయ్యంగార్ చేసిన సర్వేలో 1944 నాటికి తేలంగాణలో 89 శాతం, మరాఠ్వాడాలో 35 శాతం మంది అప్పుల్లో నివసిస్తున్నారని తేలింది.. ప్రధానంగా, దివానీ ప్రాంతాలలో రైత్వారీ విధానం వల్ల భూమిపై చిన్న రైతుల యాజమాన్యం పెరిగింది. అయినా మార్కెట్ ఎగుడు దిగుడుల వల్ల చిన్న రైతులు దివాలా తీసి, వారి భూములు క్రమంగా ధనిక రైతుల,వడ్డీ వ్యాపారస్తుల, భూస్వాముల ఆక్రమణలోకి వెళ్ళింది.
            1920 నాటికి ఉనికిలోకి వచ్చిన సంస్థాన పారిశ్రామిక - వాణిజ్య విభాగం వస్త్ర, సిమెంట్, సిగార్, టీ, బటన్ తయారీ తదితర పరిశ్రమలను ప్రోత్సహించింది.. నాటికి కాటన్ జిన్నింగ్ మరియు మిల్లులను మినహాయించి సంస్థానంలో 120 కర్మాగారాలు ఉన్నాయి. సబ్బు కర్మాగారం (1919), షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ (1925) పారిశ్రామిక ఆల్కహాల్ ఫ్యాక్టరీ (1925), డెక్కన్ గ్లాస్ వర్క్స్ (1927) లాంటి 105 ముఖ్యమైన యూనిట్లు 1930 నాటికి ప్రారంభమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో, రెండు లోహ కర్మాగారాలు, జిందా టిల్లిస్మాట్ ఖార్కనా (1906), రెండు సిగరెట్ కర్మాగారాలు చార్మినార్ సిగరెట్ (1925), వజీర్ సుల్తాన్ పొగాకు కంపెనీ (1930), అజామ్ జాహి మిల్స్, వరంగల్ (1934), నిజాం షుగర్ ఫ్యాక్టరీ (1939), ప్రాగా టూల్స్ కార్పొరేషన్ (1943) మరియు ఆల్విన్ మెటల్ వర్క్స్ (1942), హైదరాబాద్ ఆస్బెస్టాస్ (1947), స్థాపించబడ్డాయి. సిర్పూర్ వద్ద సిర్సిల్క్స్ మరియు సిర్పూర్ పేపర్ మిల్స్ స్థాపించబడ్డాయి. 1912-13 నుండి పరిశ్రమలు క్రమంగా పెరిగాయి. బొగ్గు, బంగారం, ఇనుము, గ్రానైట్, గ్రాఫైట్, డైమండ్ మరియు ఇతర గనులు కీలక పాత్ర పోషించాయి. మైనింగ్ పరిశ్రమ సుమారు 18,000 మందికి ఉపాధి కల్పించింది.ఇది. హైదరాబాద్  సంస్థానంలో ఉత్పత్తి చేయబడిన ఖనిజాల విలువలో 65 శాతానికి పైగా ఉంది. 1936 చివరి నాటికి, హైదరాబాద్‌లో 521 పరిశ్రమలు ఉన్నాయి, వీటిలో దాదాపు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 1920 ల నుండి అభివృద్ధి చెందిన ఇతర ప్రధాన పరిశ్రమ చక్కెర పరిశ్రమ. చేతితో తయారు చేసే కాగితం పరిశ్రమలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి ఈ పరిశ్రమలు 5,000 మందికి పని కల్పించాయి.. అలాగే, హైదరాబాద్  సంస్థాన గ్రామీణ జనాభాలో చేనేత పరిశ్రమ చాలా ముఖ్యమైన వృత్తి. 1943-44లో, ఇది పిల్లలతో సహా సుమారు 4,50,000 మందికి ఉపాధి కల్పించింది. జనాభాలో 30 శాతం ప్రజల వస్త్ర అవసరాలను తీర్చింది. వీటితోపాటు రైల్వే, ఎయిర్‌వేస్, సొంత కరెన్సీ, విద్యుత్, విద్యా - వైద్య రంగాలను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆధునీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918 లో స్థాపించబడింది, ఇది ఆధునిక విద్యావ్యవస్థను అందించడానికి ప్రయత్నించింది. 1923 లో విద్యుత్తు ప్రారంభించబడింది. హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ 1920 లో నిజాం VII సమయంలో నిర్మించబడింది. 
        1883 నిజాం యొక్క గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ వాడి నుండి సికింద్రాబాద్ వరకు రైల్వే మార్గాన్ని కొనుగోలు చేసింది. 1920 లలో సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు మరియు తరువాత బెజవాడ (విజయవాడ) మరియు చందా వరకు కొత్త లైన్లను- ఒకటి మీటర్ గేజ్, మరొకటి బ్రాడ్ గేజ్- నిర్మించింది. 1930 కల్లా 1328 మైళ్ళ నిడివిగల రైల్వే మార్గం నిజాం రాజ్యంలో ఉండేది. 1937 కల్లా 3000 మైళ్ల పొడవు గల మెటల్ రోడ్ల నిర్మాణం జరిగింది. 1935 లో, మద్రాస్-కరాచీ ఎయిర్ సర్వీస్‌ను నెలకొల్పి, హకీంపేట్‌ ల్యాండింగ్ గ్రౌండ్‌గా హైదరాబాద్‌ను అనుసంధానించారు. ఈ రవాణా సౌకర్యాల పెరుగుదల తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ ఇండియా ఆర్థిక వ్యవస్థతో సంలీనం చేసి, వర్తక వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడింది. ఫ్యూడల్ భూస్వామ్య సంబంధాలను బలహీనం చేస్తూ, పెట్టుబడిదారి సంబంధాల అంటే పెట్టుబడి-కూలి విధానం యొక్క అభివృద్ధికి దారితీసింది.
        ఈ విధంగా ఫ్యూడల్ సమాజ గర్భంలో ఫ్యూడల్ వర్గ అధికారము, ఉత్పత్తి సంబంధాల ప్రాబల్యం క్రింద పెట్టుబడిదారి సంబంధాలు క్రమంగా వృద్ధి చెందుతూ ఉండే స్థితి గల సమాజాలనే అర్థ ఫ్యూడల్ సమాజాలని పిలుస్తారు. అంటే ఈ అర్థ ఫ్యూడల్ సమాజంలో కూడా ఫ్యూడల్ వర్గమే ( సామ్రాజ్యవాదంతో కూడా కలసి గాని) పాలకవర్గంగా ఉంటుంది. ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాల ప్రాబల్యం క్షీణిస్తూ ఉంటుంది. ఆ ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాల చట్రంలో, ఫ్యూడల్ భూస్వామ్య వర్గ రాజ్యాధికారం కిందనే పెట్టుబడిదారి సంబంధాలు ఉద్భవించి వృద్ధి చెందుతూ, ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలను విచ్ఛిన్నం చేస్తూ, బలహీన పరుస్తూ ఉంటాయి. అట్టి సమాజం సారాంశంలో ఫ్యూడల్ సమాజమే; ఆ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిని నిర్దిష్టంగా తెలియజేసేందుకు, దానిని అర్థ ఫ్యూడల్ సమాజం అని అంటారు. ఈ అంశాల దృష్ట్యా, 20వ శతాబ్దం నాటి నిజాం పాలనలోని తెలంగాణ సమాజం అర్థఫ్యూడల్ సమాజం. మరోవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సైన్యం ప్రత్యక్షంగా ఉంటూ ఉంటూ బ్రిటిష్ ప్రత్యక్ష - పరోక్ష పాలన నిజాం తెలంగాణపై కొనసాగుతూ వచ్చిన కారణంగా నాటి నిజాం రాజ్యం ఒక అర్ధ వలస రాజ్యం. కాబట్టి, నిజాం నాటి తెలంగాణ సమాజాన్ని ఒక అర్ధ వలస - అర్ధ ఫ్యూడల్ సమాజమని మనం నిర్ధారణకు రావచ్చును.
            అందువల్ల విప్లవ పూర్వ చైనా సమాజంవలె, నిజాం తెలంగాణ కూడా ఒక అర్ధ వలస - అర్ధ ఫ్యూడల్ సమాజానికి ఒక మంచి నమూనాగా మన పరిశీలనకు తోడ్పడుతుంది. నాటి భారత దేశ నేపథ్య పునాదిపై 1946 - 50 ల మధ్య జరిగిన తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం యొక్క అనుభవాల విశ్లేషణ, గుణపాఠాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
నాటి వలస అర్ధ ఫ్యూడల్ సామాజిక పరిస్థితుల్లో తెలంగాణ ఫ్యూడల్ వ్యతిరేక సాయిధ పోరాటం 1946లో ప్రారంభమై 1948లో నిజాం రాజ్యంపై మిలిటరీ యాక్షన్ తో ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో క్లిష్ట దశకు చేరుకుంది. విలీనం కావడంతో నిజాం రాజ్యంపై ఫ్యూడల్ వర్గ అధికారం రద్దు చేయబడి,1947లో అధికార మార్పిడి అనంతరం రాజ్యాధికారంలోనికి వచ్చిన భారతీయ పెట్టుబడిదారి వర్గం యొక్క అధికారం 1948లో తెలంగాణలో నెలకొల్పబడింది. 1951 అక్టోబర్లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగింది. 
        అధికారంలోని వచ్చిన భారతీయ పెట్టుబడిదారీ వర్గం కాంగ్రెస్ నాయకత్వాన చేపట్టిన సంస్థానాల విలీనం, జమీందారి రద్దు, కౌలుదారి చట్టాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, రోడ్లు రవాణా సౌకర్యాల అభివృద్ధి, భూసంస్కరణలు - మరోవైపు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన జరిగిన భూ పోరాటాలు - ఇవన్నీ తెలంగాణలో, దేశంలో ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలను బలహీనపరుస్తూ క్షీణింపజేస్తూ పెట్టుబడిదారీ సంబంధాలను అభివృద్ధి చేస్తూ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను వేగంగా జాతీయ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంలీనం చేసే పాత్రను పోషించాయి. ఫలితంగా నాటి ఫ్యూడల్ ఆసాములు గ్రామీణ పెట్టుబడిదారులుగా, ఆనాటి వెట్టి చాకిరి చేసే కవులుదారి రైతులు వ్యవసాయ కూలీలుగా, పేద మధ్యతరగతి రైతులుగా క్రమంగా మార్పు చెందారు. భూమి ఒక వర్తకపు సరుకుగా, పెట్టుబడి సాధనంగా మారింది. స్థానిక కుటుంబ అవసరాల కొరకు కాక, వ్యవసాయ ఉత్పత్తి సంపూర్ణంగా మార్కెట్లో అమ్మకం లాభం కొరకు చేయడం బలపడింది.వీటన్నిటి వల్ల వ్యవసాయ రంగంలో రంగంలోఫ్యూడల్   ఉత్పత్తి సంబంధాలు బలహీనపడి పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు బలపడ్డాయి. స్వయం పోషక ఆర్థిక విధానం క్షీణించిపోయి ఆ స్థానంలో వేతన వ్యవస్థ బలపడింది. దీనివల్ల వ్యతిరేక వ్యవసాయక విప్లవోద్యమ నిర్మాణానికి అవసరమైన అనుకూల భౌతిక పరిస్థితులు క్షీణించిపోయి, పెట్టుబడిదారీ  సంబంధాలు, పరిస్థితులు బలపడడం వృద్ధి చెందడం జరిగింది. అంటే ఫ్యూడలిజానికి - రైతాంగానికి మధ్య గల   ప్రధాన వైరుధ్యం క్రమంగా అడుగంటిపోయి  ఫ్యూడల్ వ్యతిరేక వ్యవసాయక విప్లవ పరిస్థితులు బలహీనపడ్డాయి. ఆ స్థానంలో పెట్టుబడి - కూలి విధానం మధ్యగల వైరుధ్యం ప్రభలంగా ముందుకు వచ్చింది. 1947లో అధికార మార్పిడి వల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాద ఫ్యూడల్ వర్గాల స్థానంలో భారతీయ పెట్టుబడిదారి వర్గం అధికారంలోకి రావడం, అది ఒక కేంద్రీకృత జాతీయ రాజ్య వ్యవస్థను నిర్మించి అన్ని రంగాలలో అనుసరించిన పెట్టుబడిదారీ విధానాలు ఈ స్థితికి మూలం. ఈ పెట్టుబడిదారీ వర్గ పాలన, పెట్టుబడిదారీ దోపిడీ విధానమే నేటి మన జీవిత సమస్యలన్నిటికీ మూలం.కావున ఈ పెట్టుబడిదారీ వర్గ పాలనను దోపిడీ వ్యవస్థను కూలగొట్టే పెట్టుబడి దారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని నిజమైన కమ్యూనిస్టు పార్టీ  అనుసరించాల్సి ఉంటుంది. 
            కానీ, ఈ వాస్తవాన్ని విస్మరించి  కుడి ఎడమ కమ్యూనిస్టు పార్టీలు నేటికీ విదేశీ సామ్రాజ్యవాద భూస్వామ్య వ్యతిరేక జనతా లేదా నూతన ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమం పేరుతో అధికారంలో లేని విదేశీ సామ్రాజ్యవాదం భూస్వామ్య  వర్గాలకు వ్యతిరేకంగా కృత్రిమ పోరాటాలు నిర్మిస్తూ, నిజమైన శత్రువయిన పెట్టుబడిదారీ వర్గంతో, పెట్టుబడిదారీ పార్టీలతో కుమ్మక్కవుతున్నారు.వర్గ సంకర రాజకీయ కార్యక్రమాన్ని  స్వీకరించి అనుసరిస్తున్నారు. ఇదే నేటి కమ్యూనిస్టు ఉద్యమ సంక్షోభానికి గల మూల కారణాలలోఒకటి.
             ఈ కీలక అంశంపై నేను ప్రచురించిన “నూతన ప్రజాతంత్ర విప్లవమా? సోషలిస్టు విప్లవమా?” అనే డాక్యుమెంటును చదవవలసిందిగా, చర్చించవలసినదిగా ఆసక్తిగల  విప్లవాభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 

ఈ అంశాన్ని గురించి వీలైతే మరొక పోస్టులో చర్చిద్దాము.


 

G. Ashok

Author & Editor

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి