పెట్టుబడిదారీ విధానంలో ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉత్పత్తి జరిగి, ఆ అదనపు ఉత్పత్తి అమ్ముడు పోనందున 'అధికోత్పత్తి సంక్షోభం' సంభవిస్తుంది. 'అధికోత్పత్తి సంక్షోభం' అంటే ప్రజల అవసరాలకు మించి ఉత్పత్తి జరగడం కాదు. ప్రజల వద్ద ఉన్న కొనుగోలు శక్తి పరిమితంగా ఉన్నందున ఉత్పత్తి జరిగినదంతా అమ్ముడు పోకపోవడం. ఇది ఎందుకు జరుగుతుంది? పెట్టుబడిదారులు కార్మికులకు అంతకంతకూ తక్కువ జీతాలు చెల్లించడం ఒక కారణం. ఇంకోవైపు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తెచ్చి తక్కువ మంది కార్మికులతో ఎక్కువ పని చేయించుకోవడంతో కార్మికుల సంఖ్య తగ్గడం రెండో కారణం. అయితే ఒకసారి అధికోత్పత్తి సమస్య రాగానే పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఉత్పత్తిని తగ్గిస్తారు. దాంతో కార్మికులు పనులు కోల్పోతారు. ఉత్పత్తి తగ్గడంతో 'మాంద్యం' ఏర్పడుతుంది. మరోవైపు కొనుగోలు శక్తీ తగ్గిపోతుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇటువంటి 'ఆర్థిక మాంద్యం' పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడడం సహజమేనని, మళ్లీ మార్కెట్ సరిదిద్దుకుని మాంద్యం నుండి బైట పడిపోతుందని, ముందుకు పురోగమిస్తుందని కొందరు పండితులు చెప్తూ వుంటారు. అయితే ఇది వాస్తవం కాదు. 1930 దశకం లోని ఆర్థిక మాంద్యం ఒక దశాబ్దం పైగా కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన ప్రపంచ యుద్ధంతో మిలిటరీ వ్యయం పెరిగి తద్వారా సంక్షోభం నుండి బైట పడింది. అంటే సంక్షోభానికి మూల్యంగా అపార జన నష్టం, ఆస్తి విధ్వంసం, రక్తపాతం చెల్లించాల్సి వచ్చిందన్నమాట.
ఇప్పుడు 2008 నుండి మళ్లీ 'అధికోత్పత్తి సంక్షోభం' మొదలైంది. నేటికీ అది కొనసాగుతూనే ఉంది. సంక్షోభ పరిస్థితులను దాటేశామని అప్పుడప్పుడూ ఆర్థిక నిపుణులు కొందరు నమ్మబలుకుతున్నా, సంక్షోభం నానాటికీ ముదురుతూనే వుంది. ఇంకోవైపు ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూనే వుంది. మరో వైపు ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మీద కోతలు విధిస్తూ కార్పొరేట్లకు అదనపు రాయితీలు ఇస్తూనే వున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ లోనే ఈ సంక్షోభానికి మూలాలు ఉన్నాయి. లాభం కోసమే ఉత్పత్తి అన్న సూత్రమే దీనికి ప్రధాన కారణం.
అయితే ఏడు దశాబ్దాలు సోవియట్ యూనియన్లో, తూర్పు యూరపు దేశాల్లో కొనసాగిన సోషలిస్టు వ్యవస్థలో ఇటువంటి సంక్షోభాలు ఎన్నడూ రాలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే ఏడాది డిమాండ్ ఎంత పెరగొచ్చు అన్నది లెక్క వేసుకుని ఈ ఏడాది పెట్టుబడిని పెడతారు. ఈ లెక్క వేయడానికి ఈ ఏడాది డిమాండ్ ఎంత పెరిగింది అన్నది కొలబద్దగా తీసుకుని అంచనా కడతారు. ఈ ఏడాది డిమాండ్ తగ్గింది అన్న సూచన గనుక వస్తే వచ్చే ఏడు కోసం పెట్టే పెట్టుబడిని తగ్గించేస్తారు. పెట్టాల్సిన పెట్టుబడి తగ్గే సరికి జనం దగ్గరికి వచ్చే డబ్బు తగ్గిపోతుంది. దాంతో వినిమయం తగ్గిపోతుంది. సోషలిజంలో ఈ రెండు రకాల ధోరణులూ ఉండవు.
సోషలిజంలో ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెడతారు. లాభం ఎంత వస్తుంది? అన్న లెక్కన ఈ పెట్టుబడి పెట్టరు. ఒక వేళ ఏదైనా కారణం వలన ఒక ఏడాది డిమాండ్ తగ్గినా, ప్రణాళిక ప్రకారం ఆ ఏడాది పెట్టవలసిన పెట్టుబడులు ఆపరు. అందువలన సంక్షోభం వచ్చే అవకాశం ఉండదు. అయితే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నడకలో ఎగుడు దిగుళ్లు ఉండనే ఉండవా అంటే ఉంటాయి. ఆ ఎగుడు దిగుళ్లు లాభనష్టాలను బట్టి వుండవు.
ఒక తరహా ఎగుడు దిగుడులకు వ్యవసాయోత్పత్తిలో వచ్చే ఒడిదుడుకులు కారణం. ప్రకృతి వైపరీత్యాల వల్ల, వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉంటే పెట్టుబడులు ఆ మేరకు తగ్గిస్తారు. దానివలన ప్రజల వద్ద డబ్బు తగ్గుతుంది. ఆహార ఉత్పత్తులు తగ్గినా, ప్రజల కొనుగోలు శక్తి కూడా అదే మోతాదులో తగ్గడంతో ధరలు పెరగకుండా స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా వాతావరణం అనుకూలించి వ్యవసాయోత్పత్తులు పెరిగే అవకాశం ఉంటే పెట్టుబడిని ఆ మేరకు పెంచుతారు. దాంతో పెరిగిన ఉత్పత్తులకు తగిన మోతాదులో ప్రజల దగ్గర డబ్బూ పెరిగి, అప్పుడు ధరలు పడిపోకుండా స్థిరంగా ఉంటాయి. కనుక సోషలిస్టు వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడంలో ఉండే ఎగుడు దిగుడులకు లాభనష్టాలతో సంబంధం లేదు.
పెట్టుబడుల ప్రవాహంలో ఎగుడు దిగుడులు సోషలిస్టు వ్యవస్థలో ఇంకో కారణం వల్ల కూడా జరుగుతాయి. ప్రణాళికా కాల ప్రారంభంలో కొన్ని కొత్త రంగాలలో అభివృద్ధి కోసం, కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం అదనపు పెట్టుబడులు పెడతారు. కొన్నేళ్ల తర్వాత వాటి స్థానంలో అంతకంటే మెరుగైన కొత్త పరికరాలను తీసుకురావాల్సి వుంటుంది. పాత వాటిని తొలగించి కొత్తవి పెట్టడానికి అధిక పెట్టుబడి కావాలి. అటువంటి మార్పులు జరిగే కాలంలో అవసరమైన అధిక పెట్టుబడులు ఆ ముందు, తర్వాత ఉండవు. అలా ఎగుడు దిగుడులు ఎటువంటి సంక్షోభాలకూ దారి తీయవు. పెట్టుబడులు తగ్గినా, ఆ మేరకు ధరలనూ తగ్గించి తద్వారా డిమాండ్ కొరత లేకుండా చూసుకుంటారు. డిమాండ్ లేదన్న పేరుతో ఉత్పత్తులను తగ్గించడం, నిరుద్యోగాన్ని సృష్టించడం వంటివి అక్కడ ఉండవు. ఉత్పత్తి పూర్తి సామర్థ్యం మేరకు జరుగుతుంది. ఉత్పత్తి అయిన సరుకంతా అమ్ముడయ్యేలా ధరలు సర్దుబాటు అవుతాయి. 'లాభం కోసం ఉత్పత్తి' అన్న సూత్రం సోషలిజంలో పని చేయదు కనుకనే అక్కడి ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి సర్దుబాట్లు చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. మరి ఇలా మార్కెట్ను బట్టి కొన్ని సరుకుల ధరలు తగ్గించేస్తే ఆ సరుకులను తయారు చేసిన పరిశ్రమలు నష్టపోవా? నష్టపోతాయి. ఇలా నష్టపోయే కంపెనీలు ఉన్నట్టే లాభాలు వచ్చే కంపెనీలూ ఉంటాయి. ఆ నష్టాలు, ఈ లాభాలు అన్నీ కలబోసుకోవడం సోషలిజంలో సాధ్యం. ఎందుకంటే అది 'ఉమ్మడి యాజమాన్య వ్యవస్థ'. అటువంటి కలబోసుకోవడం వ్యక్తిగత యాజమాన్యం ఉండే పెట్టుబడిదారీ వ్యవస్థలో అసాధ్యం. మొత్తం అన్నీ కలబోసుకున్నప్పుడు పెట్టుబడులు పెరిగిన సంవత్సరాలన్నింటి లోనూ నికర లాభాలుంటాయి. పెట్టుబడులు తగ్గినప్పుడు ఆ మేరకు నికర నష్టాలుంటాయి.
అదే పెట్టుబడిదారీ సమాజంలోనైతే సంక్షోభంలో ఉత్పత్తీ తగ్గుతుంది. దాంతోపాటే ఉపాధి అవకాశాలూ తగ్గిపోతాయి. కొనుగోలు శక్తీ తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గినప్పటికీ ధరలు తగ్గవు. ఉద్యోగాలు పోతాయి. అదే సోషలిజంలో కొనుగోలు శక్తి తగ్గితే ధరలూ తగ్గుతాయి. ఉత్పత్తి తగ్గదు కనుక ఉద్యోగాలేమీ పోవు.
ఇంకో వైపు నుంచి చూద్దాం. ఉద్యోగాలు తగ్గకుండా, ఉత్పత్తీ తగ్గకుండా ధరలు తగ్గడం అంటే అర్థం ఏంటి? మొత్తం ఉత్పత్తి అయిన సంపదలో కార్మికులు వాటా పెరగడం అన్నమాట. ఇది సోషలిజంలో మాత్రమే సాధ్యం. కార్మికులు తమ వాటాగా వచ్చే ఆదాయాన్నంతా తిరిగి ఖర్చు చేస్తారు కనుక మొత్తం వినిమయంలో వారి వాటా పెరుగుతుంది. అంతే తప్ప సోషలిజంలో అధికోత్పత్తి సమస్య ఎప్పుడూ రాదు.
అదే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు సంపద లో తమ వాటా తగ్గడానికి ఏ మాత్రమూ అంగీకరించరు గనుక డిమాండ్కి కొరత ఉన్నా ధరలను తగ్గించకుండా ఏర్పాటు చేస్తారు. కార్మికుల వేతనాలనూ పెంచరు. దాని ఫలితంగా సరుకు చెల్లుబాటు గాకుండా ఉంటుంది. అధికోత్పత్తి సమస్య ఉత్పన్నమౌతుంది. సమాజంలో ఉత్పత్తయ్యే సంపదలో తమ వాటాను తగ్గించుకోడానికి పెట్టుబడిదారులు సిద్ధం కానందువల్లనే సంక్షోభం వస్తుంది. వాళ్లు దాన్నుంచి తప్పించుకోడానికి ఉత్పత్తిని తగ్గించి, కార్మికుల వేతనాలు తగ్గిస్తారు. ఈ రెండు చర్యలూ కార్మికుల వాటాను మరింత తగ్గిస్తాయి. పెట్టుబడిదారుల వాటాను మరింత పెంచుతాయి. అందుకే ఒక పక్క సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది. మరోపక్క పెట్టుబడిదారుల సంపద పెరుగుతూనే ఉంటుంది.
ఈ సంక్షోభమూ, దానికి పెట్టుబడిదారులు ప్రతిస్పందించే తీరూ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత అర్థరహితమో స్పష్టంగా వెల్లడి చేస్తాయి. ఒకపక్క ఉత్పత్తి అయిన సంపద చెల్లుబాటు గాక వృధాగా పడి వుంటోంది. ఇంకోపక్క అది దక్కవలసిన ప్రజలు అవసరాలు తీరక, కొనగలిగే శక్తీ లేక అవస్థలు పడు తున్నారు. అటు అపారమైన మానవ వనరులు వినియోగం లేక నిరుద్యోగం పెరిగి, అభివృద్ధీ స్తంభించిపోతోంది.
అదే సోషలిజం లోనైతే ఉత్పత్తి తగ్గడం ఉండదు. ఉత్పత్తి అయిన సరుకులన్నీ చెలామణీ అయ్యేలా ధరలు అవసరమైనప్పుడల్లా తగ్గిస్తారు. ప్రజల అవసరాలూ తీరుతాయి. ఉత్పత్తి తగ్గదు కనుక నిరుద్యోగమూ ఉండదు. మానవ వనరులు పూర్తి వినియోగంలోకి వస్తాయి గనుక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధీ ఆగదు.
సోవియట్ సోషలిస్టు వ్యవస్థ నిర్వహణలో ఇతరత్రా లోపాలు దొర్లి వుండవచ్చు. కాని అది కొనసాగినంత కాలమూ సంక్షోభ రహితంగానే కొనసాగింది. అదే సోషలిజం విశిష్టత. ప్రస్తుతం పెట్టుబడిదారీ సంక్షోభానికి పరిష్కారాలు దొరకడం లేదని ఆందోళన పడుతున్న వారు ఈ సమాధానం వైపు చూడరెందుకని?
- ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి