సిపియస్ విధానంలో మార్పుల కొరకు కేంద్ర కమిటీ
హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం కొత్త పెన్షన్ విధానం( సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పెన్షన్ విధానంలో మార్పులకు కమిటీని వేసింది.
పాత పెన్షన్ విధానం అంటే ట్రిపుల్ బెనిఫిట్ స్కీం. 1. ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసేనాటి బేసిక్ పే లో సగం పెన్షన్ గా చెల్లిస్తారు. ఈ పెన్షన్ కూడా వేతన సవరణ జరిగినపుడల్లా పెన్షన్ ని కూడా సవరిస్తారు. ఈ విధానంలో ఉన్న ఉద్యోగుల నుండి ఉద్యోగం చేసినంత కాలం వేతనంలో 6శాతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమచేసినట్లయితే దాని మీద వడ్డీతో సహా ఉద్యోగ విరమణ అనంతరం నగదుగా ఇస్తారు. 3. ఉద్యోగ విరమణ సమయంలోనే గ్రాట్యుటీ రూపంలో కొంత నగదుగా చెల్లిస్తారు.
పాత పెన్షన్ విధానం 01.01.2004 దాకా ఉద్యోగులకు లాభసాటిగా ఉండేది. 2004లో అప్పటి బిజేపీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 01.01.2004 తదుపరి ఉద్యోగంలో చేరే వారికి కొత్త పెన్షన్ విధనాన్ని ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా తమ వేతనం లో 10శాతం కాంట్రిబ్యూట్ చేస్తే, ప్రభుత్వం కూడా 10శాతం కాంట్రిబ్యూట్ చేసి ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టి వచ్చిన లాభాల ద్వారా ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకు వచ్చింది.
కేంద్రం తమ ఉద్యోగులకు కొత్త విధానాన్ని అమలు చేయడమే కాకుండా రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడం మంచిదని సలహా ఇచ్చింది. ఆ తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న బెంగాళ్, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసాయి. కేరళ, త్రిపురలలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారం కోల్పోయి ఇతర పార్టీలు అధికారం లోకి వచ్చిన తరువాత ఇదే విధానాన్ని అమలు చేసాయి.
కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మాకు పాత విధానంలోనే పెన్షన్ చెల్లించాలని ఆందోళనలు మొదలైనాయి. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం కొత్త పెన్షన్ విధానం(సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విదంగా నిర్ణయం తీసుకోవడంతో కేంద్రానికి గుబులు మొదలైంది. పాత విధానంలోకి పోతే పోవచ్చు గాని ఇప్పటిదాకా ఈ స్కీంలో చెల్లించిన నిధులను మాత్రం తిరిగి ఇచ్చేది లేదు అంది. రిజర్వు బ్యాంకు కూడా ఒక ప్రకటన చేస్తూ పాత విధానం అమలు చేయడం రాష్ట్రాలకు తగని పని అంటూ అలా చేయడానిక ఆర్థిక వనరులు సరిపోవని హెచ్చరించింది. అయినా ఇటీవల మహారాష్ట్రలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాత పెన్షన్ లో మాదిరిగా ప్రయోజనాలు కలిగేవిధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులకు ముందుకు వచ్చింది. ఉద్యోగులు తము చేసే 10శాతం కాంట్రిబ్యూషన్ కు ప్రభుత్వం ఇప్పటిదాక 14 శాతం కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్న దానిని 20 శాతానికి పెంచుతామని వాగ్దానం చేయాల్సి వచ్చింది.
ఈ పూర్వరంగంలో కేంద్రం కూడా తప్పని సరి అయి ఏదోవిధంగా ఉద్యోగులను మంచి చేసుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చి గతంలో ఈ కొత్త పెన్షన్ స్కీం అమలుకు ముందే ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలలోకి వచ్చిన వారికి వచ్చే ఆగష్టు 31 లోగా ఆప్షన్ ఇచ్చి పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే విధంగా వెసులు బాటు కల్పించింది. అయినా ఉద్యోగుల ఆందోళనలు తగ్గలేదు సరికదా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గత శుక్రవారం రోజున ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ నేత్రుత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ ప్రస్తుత కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగుల ఆశలు నెరవేరేలా ఎలాంటి మార్పులు చేయాలో సూచిస్తుంది.
టివి సోమనాథన్ కమిటీ ఏం సూచనలు చేస్తుందో వేచి చూడాల్సిందే. అంతే తప్ప కేంద్రం సిపియస్ విధానాన్ని రద్దుచేసి ఓపియస్ విధానాన్ని అమలు చేయడానికి కమిటీ వేసిందని కొందరు చెబుతున్నది సరికాదు. ఇక పోతే టివి సోమనాథన్ కమిటీ కూడా చేసేది ఏమిటంటే ఆం.ప్ర. ప్రభుత్వం మాదరిగా జిపియస్ విధాన్నాన్ని ప్రతిపాదించ వచ్చు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుత సిపియస్ విధానంలోనే ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలో 33శాతం పెన్షన్ ని గ్యారంటీ చేస్తాం అంది. అలాగే కాంట్రిబ్యూషన్ ని 14 శాతానికి పెంచడానికి ఒప్పుకుంటే పై 33 శాతాన్ని 40శాతానికి గ్యారంటీ చేస్తామనీ అంది. కాని, ఆ విధానాలు నచ్చక, అక్కడి ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్న విషయమూ మనకు తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉద్యోగుల ఆందోళనలను చల్లార్చే దాంట్లో భాగంగా మరింత ఉపశమనం ప్రకటించే అవకాశం మాత్రం ఉంది. అంతే తప్ప అసలు సిపియస్ విధానాన్ని రద్దు చేసి ఓపియస్ విధానం తెచ్చే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు లేదు. ఉద్యోగులు తమ ఆందోళనలను మరింత ఉద్రుతం చేసి తమ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది.
విచారించవలసిన అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో , వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న ఆందోళన కూడా మన తెలంగాణ లో లేదు. బడా ఉద్యోగ సంఘ నేతలను తన చంకలో పెట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు స్పందించే అవకాశం కూడా లేదు. యుఎస్ పిసి చొరవతో గత 2018లో ఏర్పడినట్లు ఏదైనా ఐక్య వేదిక ఏర్పడితే తప్ప ప్రయోజనం లేదు. మనం మేల్కోవాలి. మన మిత్రులను మేల్కొల్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది.
గడ్డం అశోక్
TAPRPA St Sec.
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి