ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం..
ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం
జాతీయ క్రైమ్ బ్యురో లెక్కల ప్రకారం భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో 9శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వీటిలో మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నావారే కావడం గమనార్హం. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు 2022 ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 10, 11వ స్థానాల్లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అధికశాతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల్లో ఉండడమే. వారి ప్రభావం మూలంగా గత మూడు దశాబ్దాలలో ఇంటర్మీడియట్ విద్యలో ఎటువంటి సంస్కరణలు జరగలేదు. కార్పొరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాలకోసం పోటీ ప్రపంచంలో తామంలే తాము ముందున్నామని ప్రజలను నమ్మించడం కోసం విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు.
విద్యలో మౌలిక వ్యత్యాసాలు
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) విధానం, ఆంధ్రప్రదేశ్ లో సిబిఎస్ఈ పరీక్షల విధానం అమలులో ఉన్నాయి. పదో తరగతి సిలబస్, ఇంటర్ మీడియట్ సిలబస్ మధ్య చాలా వైవిధ్యత ఉంటుంది. పదో తరగతి బోర్టు పరీక్షలలో ప్రశ్నీ పత్రం విధానానికీ, ఇంటర్మీడియట్ పరీక్ష పత్రం విధానానికి కూడా మౌళికంగా చాలా తేడాలు ఉన్నవి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ఆగష్టులో పూర్తి అవుతాయి. పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. విద్యార్థి కేవలం 6 నెలల్లో పరీక్షలకు సిద్దం అయి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
మొదటి సంవత్సరం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి
కొన్ని సందర్భాలలో విద్యార్థులు మొదటగా ఒక గ్రూపు ఎంపిక చేసుకుని, తరువాత వివిధ కారణాల వలన వేరే గ్రూపుకు మారుతుంటారు. అలాంటి విద్యార్థులకు మరింత తక్కువ సమయమే దొరుకుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా ఒత్తిడితో పరీక్షలకు హాజరు అవుతున్నారు. దీని ప్రభావంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి విద్యార్తులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులూ, రెండవ సంవత్సరం సబ్జెక్టులు కలిపి పరీక్షలకు ఒకేసారి హాజరు కావడం వల్ల రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు గురి అవుతున్న విద్యార్థులలో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటర్ ఫలితాలు వెలువడిన ప్రతిసీరి విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులు కోర్సు మొదలయిన రోజునుండి ఫలితాలు వచ్చేవరకు రెండు సంవత్సరాలపాటు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. దీనికి కారణం బోర్డు పరీక్షలు, కార్పొరేట్ శక్తుల మరియు తల్లిదండ్రుల ఒత్తిడి.
మొదటి సంవత్పరం పరీక్ష తొలగింపే మంచిది
దేశంలో కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో మాత్రమే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం అంతర్గత మూల్యాంకనం ద్వారా మాత్రమే విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను నమోదు చేస్తున్నారు. ఇంటర్మీడిట్ మొదటి సంవత్సరం పరీక్షల్ని తొలగిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మొదటి ఏడాది సిలబస్ లో కీలక అంశాలపై పట్టు సాధించడంతోపాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం, సౌలభ్యం దొరుకుతుంది. అధ్యాపకులు కూడా పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వెసులు బాటు ఉంటుంది. అదేవిధంగా జాతీయ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల బోర్డులు కేవలం 12వ తరగతి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నందున వారితో సారూప్యత ఏర్పడుతుంది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తే విద్యార్థులు, అధ్యాపకులలో మొదటి సంవత్సరంపై శ్రద్ధ తగ్గి కేవటం రెండవ సంవత్సరంలపై మాత్రమే ద్రుష్టి పెడతారని కొందరు విద్యావేత్తల అభిప్రాయం. మొదటి సంవత్సరం ఇంటర్నల్ పరీక్షలు, మూల్యాంకనం పకడ్బంధీగా నిర్వహించడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.
అభ్యసన సామర్థ్యాల మెరుగుదల అప్పుడే
విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరగాయని పరిశోధనల ద్వారా రుజువయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షలను రద్దుచేసి అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని నమోదు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భయరహితంగా పరీక్షలు సిద్ధం అవుతారు. విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. పోటీ పరీక్ష మాయజాలంలో పడి మధ్యతరగతి తల్లిదండ్రులు వారి ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువగా అప్పులు చేసి వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. పిల్లలపై ఒత్తిడి పెరగడానికి అలా తల్లిదండ్రలు కూడా కారణమవుతున్నారు.
ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు ఆవశ్యకత
ప్రభుత్వమే ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులు రాసే పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహించడం ప్రభుత్వ రంగంలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవడం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ విద్యలో అలాంటి సంస్కరణలు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు అంశంపై ప్రతిపాదనలు చేయడం ద్వారా చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలు సంస్కరణలు చేయడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తాయని ఆత్మహత్యలు నివారించడానికి క్రుషి చేస్తాయని ఆశిద్దాం.
Dr. A. Venu Gopala Reddy
Pakala Sankar Goud
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి