సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత
( సర్వాయి పాపన్న జయంతి 18 ఆగస్ట్ సందర్భంగా)
వీరగోని పెంటయ్య.
జాన్ సఫార్ ఖాన్ దక్కన్ కు కొత్తవాడు. సువిశాలమైన సుభాల వ్యవహారం అర్థం చేసుకొనే సమయం లోనే కక్కుర్తి పరులైన కొందరు సుభేదార్లు తమ సుబాలను మరింత విస్తరించుకొనే ఆపేక్షలో బడి ఒకరి పై ఒకరు సాయధా దాడులకు పూనుకుంటారు. సైన్యం రహదారుల వెంట కవాతు చేస్తూ సుభాల సరిహద్దులను అతిక్రమిస్తుంటాయి. ఆ క్రమం లో పల్లెల్లోని బలహీన వర్గాల ప్రజల పైన ,ఆస్తుల పైన సైనిక దాడులు జరుగుతుంటాయి.ఘనపూర్ సుబాహ షాపురం గ్రామం లోని సామాన్య గీతకార్మిక కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న కుటుంబం పైన కూడా సైనిక దాడి జరుగుతుంది. ఇదెక్కడి అన్యాయం ఆని ప్రశ్నించిన నేరానికి పాపన్న పైనకూడ దాడి జరుగుతుంది.
క్రీ. శ. 1650 లో పుట్టిన సర్వాయి పాపన్న వయసు ఆనాటికి 37 సంవత్సరాలు. అప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న సూర్ దాస్, సంత్ రవిదాస్, మీరాబాయి, సూర్ దాస్, తులిసీ దాస్, కబీర్, రాందాస్, గురు తేజబహదూర్, గురు గోవింద్ సింగ్, గురునానక్, బసవేశ్వర్, వేమన, లాంటి వారి భక్తి,, భావజాల ఉద్యమాల , పాటల జాతరలు మండువల్లో మారుమోగుతుండిన ఫలితంగా నాటి ధిక్కార భావజాలం పాపన్నను ప్రభావితం చేసి ఉంటుంది.
అధికారం, ఆధిపత్యానికి కేంద్రాలు, ఆనాటి గడీల వ్యవస్థ అనీ, వాటికి వెన్నుదన్నుగా ఉన్నది గోల్కొండ రాజ్యాధికారం అనీ, ప్రౌఢ ప్రాయంలో ఉన్న పాపన్నకు సులభంగానే అర్థం అయింది. మరి తమలో ఉన్న, బానిస దాస భావజాలానికి మూలాలు ఎక్కడ ఆని ఆలోచించిన పుడు అవి “ కులం” లో ఉన్న విషయాన్ని అర్థం జేసుకున్నాడు. ఈ కులాల పుట్టుకకు కేంద్రం మతం అన్న విషయం ఆయన మండువల్లో విన్న బోధనలు అర్థం చేయించాయి. అందుకని కులాలను ఏకం చేయకుండా, మత సామరస్యాన్ని సాధించకుండా తమ పైన జరుగుతున్న ఆధిపత్యాన్ని అణిచివేతను ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం పాపన్న కు అర్థం అయింది.
అందుకే కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు , మంగలి మాసన్న, చాకలి సరవన్న, దూదేకుల పీర్ సాహెబ్, హాసన్, హుసేన్, తురక హిమాం, కొత్వాల్ మీర్ సాహెబ్, పుర్ దిల్ ఖాన్, హనుమంతు, మేదరి ఎంకన్న, ఎరుకలి సిట్టెలు, ఏనాది పాసెలు వంటి 20,000 మంది సైనిక శక్తిని సర్వాయి పాపన్న సమకూర్చుకున్నాడు. (Source; A social History Of Daccan. Cambridge Histories. Cambridge University Press.)
చాకలి, మంగలి, కుమ్మరి, బుట్టలు అల్లే వారు, దళితులు(జక్కుల) మహ్మదీయులు, దూదేకుల, ఇట్లా వివిధ కులాల మతాల వారి ఐక్య సంఘటన ద్వారా 17 వ శతాబ్దం లోనే 20,000 మంది సైన్యాన్ని కూడగట్టి ఆనాటి భారత సామ్రాజ్యవాద మొఘల్ చక్రవర్తులను గెలిచిన చరిత్ర మన కండ్ల ముందు కనబడుతోంది.
ఈనాడు అందరు కులాలు పోవాలి అంటున్నారు. కానీ కుల సంఘాలు బలపడాడానికి ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు. మనుషుల మధ్య ఉండవలిసిన సోదర స్వభావాన్ని కులం ధ్వంసం చేస్తుంది. అణగారిన కులాలు ఎక్కడో ఒకచోట నిత్యం అవమానాలకు గురవుతూనే ఉంటారు. మరో చోట ఏదో ఓ కులం తాము అధికులమని సంతృప్తి పొందుతూ ఉంటుంది. శారీరక శ్రమ అల్పం, బౌద్ధిక శ్రమ అధికం అనే భావజాల ఫలితమే, ఎక్కువ, తక్కువ కులాల లోని సారం అని పాపన్న అర్థం చేసుకున్నాడు. బుద్ధితో ఆలోచించి గురిచూసి చేతులతో బరువైన తుపాకిని ఎత్తి కాల్చితేనే దోపిడిని నిలువరించగలమని, బౌద్ధిక శ్రమ, భౌతిక శ్రమ రెండింటి మేలు కలయికనే మనిషి పురోగామికి మార్గదర్శనం ఆని పాపన్న ఆనాడే అర్థం చేసుకున్నాడు.
మతాల మధ్య విద్వేషాలు మనుషులకు కీడుచేస్తాయే కానీ మేలు చేయవని 370 ఏండ్ల కిందటనే ఆనాడు పాపన్న అర్థం చేసుకోని కులేతరులతో, మతేతరులతో సమూహం కడితే, ఇప్పుడు .మనమేమో మన మతం కానివాడితో ప్రమాదం ఆని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాము. మన కులం కానీ వారితో పెళ్ళిళ్ళు జరిగితే చంపివేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు గీతకార్మికుల ఓట్ల కోసం ఇవ్వాల సర్వాయి పాపన్నను భుజానికి ఎత్తుకుంటున్నాయి. కానీ ఆయన భావజాలాన్ని కదా ప్రచారం చేయవల్సింది. ఏమిటి ఆయన భావజాలం? ఏమిటి ఆయన తాత్వికత? ఎక్కడైనా, ఎప్పుడైనా బలహీనుడిని బలవంతుడు పీడిస్తే, దోచుకొంటే అక్కడ పాపన్న ప్రత్యక్షమై బలహీనుల పక్షాన నిలబడ్డాడు. ప్రతి మనిషికి పాలకులు ఏవైతే సౌకర్యాలు పొందుతున్నారో అవే సౌకర్యాలు సామాన్య ప్రజలందరికీ దక్కాలని కదా పాపన్న గడీలల్లో పోగుబడ్డ సంపదను ప్రజలకు పంచి పెట్టింది? ఇవి కదా పాపన్న గురించి మాట్లాడుకోవాల్సింది? ఆయన జన్మ దిన సందర్భంగా ఆ విలువలను ఆచరణలో పెడుతామని ప్రతి పాలక వర్గ ప్రతినిధి ప్రజలకు వాగ్దానం చేయవలసి ఉంది . ఇవి కదా సమకాలీన సమాజానికి సర్వాయి పాపన్న ప్రాసంగికతను తెలుపవలసిన అవసరం ఉన్న అంశాలు.
1687లో మొఘలులు ఎదుర్కొన్న సంక్షోభం నుండి బైట పడేదానికి పాడి ఆవు లాంటి దక్కన్ పై దాడి జేసీ ఇక్కడి వనరులను, ఇక్కడి ప్రజలను విపరీతంగా దోపిడి జేసిన ఫలితంగా దక్కన్ లో ఒక సర్వాయి పాపన్నను కాలం కన్నది. అలాగే ప్రపంచ యుద్ధాల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత గడ్డ పైన సాగించిన దోపిడి దౌర్జన్యాల ఫలితంగా భారంత స్వాతంత్రోద్యమం ఒక భగత్ సింగ్ ను కన్నది. 1970వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ ప్రభావం ఫలితంగా ఏర్పడ్డ సంక్షోభం నుండి దేశంలో వేలాది ప్రజా ఉద్యమ కారులను కాలం కన్నది అందులో గద్దర్ లాంటి వారు ఎందరో. అలాగే విశాలాంధ్ర ఏర్పడ్డ నుండి తెలంగా పైన ఎంతో దౌర్జన్యం దోపిడి జరిగినా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల కాలంలో అది పతాకస్థాయికి చేరి సర్వ విధాలా దోపిడీ, పీడనలు జరిగినందున ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది.
1687, 1920-47, 1976-77, 1980-2014 వరకు జరిగిన కాలాన్ని గమనించి నపుడు అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి పేరిట అలివిగాని వనరుల విధ్వంసం జరుగుతున్నది. ప్రజా విస్తాపనం జరుగుతున్నది. విపరీతమైన పన్నులు వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న పరిస్తితి. విద్య, వైద్యం అంగట్లో అత్యంత పిరపు సరుకులు అయినాయి. మనుషుల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషాలూ రగల్చడమే ఒక విధానంగా సాగుతున్న పరిస్థితిలో ఎందరు సర్వాయి పాపన్నలు, ఎందరు భగత్ సింగ్ లు ఎందరు గద్దర్ లు పుట్టుకు రావాల్సిన పరిస్తితి ఉంటుందో కాలమే నిర్ణయించాలి.
వీరగోని పెంటయ్య.
కరీంనగర్ . 9908116990